భగ్గుమంటున్న భానుడు .. సౌర శాస్త్రవేత్తల హెచ్చరిక..!


రోజురోజుకీ సూర్యుడి తాపం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటోంది
. అందులోనూ వేసవి కావడంతో సూర్యుడి అగ్నిగోళంలా భగభగమని నిప్పులు గక్కుతున్నాడు. బుధవారం ఉదయం 9.27 నిమిషాల సమయంలో సూర్యుడి నుంచి భారీ స్థాయిలో జ్వాలలు ఎగశాయి. సూర్యుని అతివేడితో దాని ప్రభావం సమీపంలోని శాటిలైట్లు, GPS వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని సోలార్ సైంటిస్టులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. 


కోల్‌కతా కేంద్రంగా ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సైన్సెస్‌
ఇండియా- (CESSI)’ ఒక ప్రకటనలో వెల్లడించింది. సౌర అయస్కాంత ప్రాంతమైన AR12992 నుంచి X‌-2.2 శ్రేణి సౌరజ్వాలలు సూర్యుని నుంచి భారీ స్థాయిలో వెదజల్లినట్టు తెలిపింది.భారతదేశం, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లోనే ఈ సౌరజ్వాలల ప్రభావం అధికంగా ఉన్నాయని CESSI నిపుణులు గుర్తించారు. దీని ప్రభావంతో హై-ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు స్తంభించే అవకాశం ఉందని, అలాగే శాటిలైట్లు, జీపీఎస్‌ పనితీరులో లోపాలు తలెత్తే ఛాన్స్ ఉందంటున్నారు. ఎయిర్‌లైన్స్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై కూడా తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉందని CESSI సమన్వయకర్త, ప్రొఫెసర్‌ దివ్యేందు నంది వెల్లడించారు. సౌరజ్వాలల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.