ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న వేళ.. ముందస్తు ముచ్చట్లు జోరుందుకున్న సమయాన.. పవన్ ఎలాంటి అంశాలు మాట్లాడుతారు. ఏం ప్రకటించబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. అటు సభా ప్రారంభానికి ముందే అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఆవిర్భావ సభకోసం ప్రకాశం బ్యారేజ్ వారథిపై కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభకు ఎలాంటి ఆటంకాలు కలగించకుండా సహకరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. అటు ప్రభుత్వ తీరుని నిరసిస్తూ జనసేన శ్రేణులు ఆందోళన సైతం చేపట్టాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇది కేవలం ఆవిర్భావ సభ మాత్రమే కాదు. భవిష్యత్ ఆశల వారధి సభ. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం జరిగే సభ. ప్రజల ఇబ్బందులపై గళమెత్తుతా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా.. సభా వేదిక నుంచే భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తా మరి కొన్ని గంటల్లో జరగబోయే ఆవిర్భావ సభపై జనసేనాని పవన్ కల్యాణ్ ముందుగా పేర్కొన్న మాటలివి.
సభా వేదికగా ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తానని పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారు. దీంతో ఇప్పటివరకు జరిగిన సభలు వేరు. ఇది వేరు అంటున్నాయి జనసేన వర్గాలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గుంటూరు మంగళగిరిలో భారీ ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు లక్షలాది మంది జనసమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 12 కమిటీలను నియమించారు. అలాగే 11 వందలకుపైగా వాలంటీర్లతో కూడిన టీమ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. సభావేదికకు దామోదరం సంజీవయ్యగారి పేరు పెట్టారు.