ఏపీ ప్రభుత్వం ఈ 5 నెలల్లోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రూ.37890 కోట్లు తెచ్చిందని చెబుతున్నారు. నాబార్డు నుంచి రూ.390 కోట్లు కేంద్రం నుంచి ఈఏపీ కింద రూ.1680 కోట్లు.. జూన్లో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎన్సీడీలు జారీ చేసి రూ.8300 కోట్ల అప్పులు తెచ్చిందని సమాచారం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు రూ.44574 కోట్ల మేర అప్పులకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను కొనసాగిస్తే ఇంకో రూ.4203 కోట్లు అదనంగా తెచ్చుకునే వెసులుబాటు ఇచ్చింది. దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటే అప్పుల పరిమితి రూ.48777 కోట్లకు చేరుతుందని అంటున్నారు.
అయితే రాష్ట్రంలో ఇంకా సీపీఎస్ రద్దు చేయలేదు కాబట్టి రాష్ట్రం రూ.44574 కోట్లనే పరిగణనలోకి తీసుకుంటే ఇంకా రాష్ట్రానికి రూ.677 కోట్ల అప్పులు చేసే వెసులుబాటు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు బేవరేజెస్ కార్పొరేషన్ ను తనఖా పెట్టిన తెచ్చిన అప్పు రూ.8300 కోట్లను జగన్ ప్రభుత్వం అప్పుల పరిమితిలో చూపకుండా దాచిపెడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వారం కూడా రిజర్వు బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రూ.1000 కోట్ల రుణం తెచ్చింది. ఇందుకు జగన్ ప్రభుత్వం రాష్ట్ర సెక్యూరిటీల వేలంలో పాల్గొని 7.58 శాతం వడ్డీకి ఈ రూ.1000 కోట్లు తీసుకుందని చెబుతున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 6న జరిగిన వేలంలో అధికారులు పాల్గొన్నారని అంటున్నారు. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణం రూ.25 వేల కోట్లకు చేరువైందని సమాచారం