అత్యంత వేగంగా దూసుకొస్తున్న సౌర తుఫాన్ గురువారం (మార్చి 31)న భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. సౌర తుఫాను కారణంగా భూమిపై తీవ్ర ప్రభావంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. దాదాపు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాన్ దూసుకొస్తోంది. ఈ రోజు ఏ క్షణమైనా భూమిని సౌర తుఫాన్ ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు.
ఎందుకంటే… మార్చి 28న సూర్యుడిపై రెండు రీజియన్లలో భారీగా విస్పోటనాలు జరిగాయి. దాంతో అక్కడ కరోనల్ మాస్ఎజెక్షన్ రిలీజైంది. దీని కారణంగా హీట్ వేవ్ భారీ స్థాయిలో వెలువడింది. ఇప్పుడు అది అంతరిక్షంలో అత్యంత వేగంతో పయనిస్తోంది. భారీ విస్పోటనం జరిగినప్పటి నుంచి మూడు రోజులుగా సూర్యుడి నుంచి తీవ్ర స్థాయిలో జ్వాలలు ఎగసిపడుతున్నాయి.
ఈ భారీ వేడి తరంగాలు భూమిని ఢీకొట్టనున్నాయి. ఈ సోలర్ స్ట్రోమ్ భూమిపై ఉండే అయస్కాంత తరంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.21 లక్షల 85 వేల 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ సోలార్ తుఫాన్ వేగం.. భూమిని చేరుకునేసరికి 496 నుంచి 607 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సోలార్ వేవ్ ప్రభావానికి శాటిలైట్లు గతి తప్పే అవకాశం ఉంది. శాటిలైట్లలోని కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో సౌర తుఫాన్ బారిన పడి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్కు చెందిన 40 శాటిలైట్లు పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు కూడా శాటిలైట్లపై సౌర తుఫాను ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు సైంటిస్టులు.