ఈ దేశం నాదనుకునే నాయకుడు ఒక్కడూ లేడు.


పవన్‌ కల్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌
ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన అధినేత పాల్గొన్నారు. పవన్‌తో పాటు డాక్టర్‌ పద్మజారెడ్డి, ఎం.వి.ఆర్‌.శాస్త్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎం.వి.ఆర్‌.శాస్త్రి రచించిన ‘నేతాజీ’ గ్రంథ సమీక్షలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎంవీఆర్‌ శాస్త్రిని ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే కలిశాను. 

ఆయన దాదాపు 20 పుస్తకాలు రచించారు. నేను సినిమా ఉచితంగా చూస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వను. అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలే ఎక్కువ విలువైనవి. నా దగ్గరకు త్రివిక్రమ్‌ వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తాను’ అని పవన్‌ పేర్కొన్నారు.కాగా నేతాజీ గురించి ప్రసంగించిన పవన్‌.. ‘జైహింద్‌ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్‌ చంద్రబోస్‌. వంద రూపాయల నోటుపై ఆయన బొమ్మ వేయాలి. ఆయన్ను గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదు. 

ఈ దేశం నాదనుకునే నాయకుడు ఒక్కడూ లేడు. ఎంతో మంది బలిదానాల వల్లే ఈరోజు దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఇక దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల జీవితాలను చదవడం వల్లేనాకు జీవితమేంటో తెలిసింది. నేతాజీ కోసం కొత్త తరం కదలాలి. నేతాజీ అస్థికలు రెంకోజి ఆలయంలో దిక్కులేకుండా ఉన్నాయి. ఆయన అస్థికలను తిరిగి తీసుకురావాలి. ఆ అస్థికలు నేతాజీవేనా? కాదా? అని పరీక్షలు చేసి తేల్చలేమా? ఇప్పటివరకు మూడు సార్లు ప్రయత్నించినా కుదరలేదు. నేతాజీ అస్థికలు దేశానికి తీసుకురావాలని ప్రజలందరూ కోరుకోవాలి’ అని పవన్‌ తెలిపారు.