జింకల మందపై వేటగాళ్లు కాల్పులు..12 మూగజీవాలు బలి


ఏపీలోని కర్నూలు జిల్లా నారాయణపురం
గ్రామ పొలాల్లో పట్టపగలే వేటగాళ్లు రెచ్చిపోయారు.జింకల మందపై తుపాకులతో విరుచుకుపడ్డారు. వేటగాళ్ల తుపాకీ తూటాలకు మందలో 12 జింకలు బలి అయ్యాయి. 

దీంతో తమ పంట పండింది అనుకున్న దుర్మార్గులు అత్యంత దారుణంగా తుపాకుల తూటాలకు నేలకొరిగిన జింకల్ని తమ వెంట తెచ్చుకున్న కత్తులతో జింకల తలలు వేరు చేసి, మాంసంతో అక్కడి నుంచి ఉడాయించారు.ఆదోని మండలం నారాయణపురం పొలాల్లోని గోర్జి వంక సమీపానికి ఆదివారం ఉదయం కొందరు వేటగాళ్లు జీపులో వచ్చారు. కొద్దిసేపటికే తుపాకులతో జింకలపై తూటాల వర్షం కురిపించారు. దీంతో అక్కడికక్కడే 12 జింకలు నేలకొరిగాయి.

ఆ జింకల తలలను కత్తులతో వేరుచేసి అక్కడే పడేశారు. మాంసం జీపులో వేసుకుని గ్రామం మీదుగానే పరారయ్యారు. ఈ దృశ్యాలు చూసిన గ్రామస్థులు పోలీసులకు, అటీవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి జింకల తలలను స్వాధీనం చేసుకున్నారు.ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో కర్నూలు జిల్లాలో వన్యప్రాణులకు రక్షణ కరవైంది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేటగాళ్లు ఆదోని,కౌతాళం మండలలో జింకల మాంసం కోసం వేటాడి చంపుతున్నారని రైతులు, వ్యవసాయ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే జింకలపై కాల్పులు జరపటం..అత్యంత పాశవికంగా మూగజీవాల తలలు కత్తులతో ఖండించటంతో మిగిలిన కళేబరాలు అక్కడే పారవేసి పోవటంతో స్థానికంగా జింకల కళేబరాలు తీవ్ర కలకలం రేపాయి.