ఉపాధి కల్పన అంటే “సలహాదారు పోస్టులు” ఇచ్చుకోవడం కాదు: పవన్


రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు
సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈవిషయాన్ని పాలకులు గుర్తించాలని ఏపీలో అధికార వైసీపీ పార్టీ నుద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నిరుద్యోగం, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా అని ప్రశ్నించారు
అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా… ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ చెప్పారని..ఇంతవరకు మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు.. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారువైసీపీ పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10 వేల ఉద్యోగాలతో క్యాలెండర్ వేశారని… అవి ఇప్పటికీ భర్తీ కాలేదని అధికార పార్టీపై పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ చర్యలతో యువత నిరాశనిస్పృహలలో కూరుకుపోయారని, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు పిచ్చిపిచ్చి హామీలు ఇచ్చిన జగన్.. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మరచిపోయారని ఎద్దేవా చేసారు. ఉద్యోగాల కోసం యువత కలెక్టరేట్లకు వెళితే వారిపై లాఠీ ఛార్జీ చేయించి అరెస్టులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నా పవన్.. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ వైసీపీ ప్రభుత్వం దగ్గర ఉందా అని ప్రశ్నించారు.

యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం ముఖ్యమంత్రి జగన్ ఇంతవరకు ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారు? వాటిలో నిర్ణయాలు ఏమిటి? అమలు ఎంత వరకూ వచ్చిందని? పవన్ ప్రశ్నించారు. మెగా డి.ఎస్సీ ప్రకటన ఎప్పుడు చేస్తారు, ఆరు వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో సీఎం జగన్ స్వయంగా నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. బిఈడీ చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వాళ్ళు, వివిధ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వాళ్లు.. నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందనే ఆందోళనలో ఉన్నారని వారి ఆందోళన ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా అని ప్రశ్నించిన పవన్.. ఒకవేళ అర్థమైనా అర్థం కానట్లు ఉందా అనే సందేహం కలుగుతోందని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు