నిరుద్యోగుల కోసం కార్యాచరణ ఉందా.. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్.


జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్లో ప్రశ్నలు సంధించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా..? అంటూ పవన్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా.. ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులు పెట్టి మరీ చెప్పారు.. మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదంటూ పవన్ కల్యాణ్మండి పడ్డారు. పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10 వేల ఉద్యోగాలతో క్యాలెండర్ వేశారు.. అవి ఇప్పటికీ భర్తీ కాలేదన్నారు. నిరాశనిస్పృహలతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారని.. అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చారు.. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మరచిపోయారన్నారు..


తమకు ఉద్యోగాలు ఏవి అంటూ కలెక్టరేట్ల దగ్గరకు వెళ్ళి యువత అడిగితే లాఠీ ఛార్జీలు చేయించి అరెస్టులు చేయిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ అనేది ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం ముఖ్యమంత్రి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారన్నారు. వాటిలో నిర్ణయాలు ఏమిటి? అమలు ఎంత వరకూ వచ్చిందో యువతకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.మెగా డి.ఎస్సీ ప్రకటన ఎప్పుడు చేస్తారు.. 6వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియచేయాలన్నారు. బిఈడీ చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నవాళ్ళు.. వివిధ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందనే ఆందోళనలో ఉన్నారని పవన్ ఆందోళన వ్యక్తంచేశారు. యువత ఆందోళన అనేది ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా? అర్థమైనా అర్థం కానట్లు ఉందా అనే సందేహం కలుగుతోందని.. పవన్ పేర్కొన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని.. ఈ విషయం పాలకులు గుర్తించాలంటూ పవన్ ఎద్దేవా చేశారు..

అంతేకాకుండా పవన్ కల్యాణ్ మరో ట్విట్ కూడా చేశారు. సీఎం జగన్‌ది విచిత్ర ధోరణి.. కపట మనస్తత్వం అని ట్విట్ చేశారు. సమస్యను సృష్టిస్తారు.. తానే పరిష్కరిస్తానని ప్రచారం చేసుకుంటారంటూ పేర్కొన్నారు..